భద్రాచలం వద్ద గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
క్షేత్రస్థాయిలో వరద పరిస్థితులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్.
ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం – లోతట్టు ప్రాంతాల ప్రజలు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి.
భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో శనివారం ఉదయం 10.00 గంటలకు గోదావరి నీటిమట్టం 56.00 అడుగులకు చేరుకుని మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరిలో 15,90,778 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్ శనివారం ఉదయం భద్రాచలం గోదావరి స్నాన ఘాట్లు, కరకట్ట ప్రాంతం.
భద్రాచలం–కూనవరం ప్రధాన రహదారి వెంట వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం, నీటిమట్టం పెరుగుతున్న పరిస్థితి, ప్రభావిత గ్రామాల పరిస్థితి, సహాయక చర్యల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల ప్రజలను టామ్టామ్, మైకింగ్ ద్వారా నిరంతరం అప్రమత్తం చేయాలని, గ్రామాల్లో ప్రజలకు పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. వరద ముప్పు ఉన్న గ్రామాల ప్రజలను ఆలస్యం చేయకుండా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఎవరూ తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకుండా అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, నాణ్యమైన భోజనం, పారిశుద్ధ్య వసతులు, విద్యుత్, వైద్య సేవలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి పునరావాస కేంద్రంలో వైద్య బృందాలు, తాగునీటి సరఫరా, విద్యుత్, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం భద్రాచలం–కూనవరం ప్రధాన రహదారి వెంట వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, వరద నీరు చేరిన ప్రాంతాల్లో వెంటనే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బ్యారికేడ్లను దాటి వెళ్లకుండా పోలీసు శాఖ నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు పోలీసు బలగాలను మోహరించాలని సూచించారు. ప్రజలు గోదావరి నదిలో స్నానాలు చేయడం, ఈత కొట్టడం, వరద నీటిలోకి వెళ్లడం, ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం, వంతెనలు, కరకట్టలు, వరద ప్రవాహం ఉన్న ప్రాంతాలకు వెళ్లడం వంటి చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వరద నీటిలో చేపలు పట్టేందుకు లేదా పడవల ద్వారా ప్రయాణించేందుకు ఎవరూ ప్రయత్నించరాదని హెచ్చరించారు. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని, అత్యవసర పరిస్థితుల్లో జిల్లా 24×7 ఫ్లడ్ కంట్రోల్ రూమ్ (08744-241950) లేదా వాట్సాప్ నంబర్ 9392919743ను సంప్రదించాలని తెలిపారు. విద్యుత్ తీగలు నీటిలో పడిన ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నారులను వరద నీటి సమీపానికి వెళ్లనివ్వవద్దని, పశువులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు అవసరమైన మందులు, తాగునీరు, ముఖ్యమైన పత్రాలు, అవసరమైన వస్తువులను వెంట తీసుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను విస్తృత స్థాయిలో కొనసాగిస్తున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు సహకరించి అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.

