📄 ePaper
Thursday, August 13, 2026
HomeMANA MI VARTAఆ స్థలాలు ఎక్కడికీ పోవు.. నేను హామీ ఇస్తున్నా: సీఎం రేవంత్ రెడ్డి

ఆ స్థలాలు ఎక్కడికీ పోవు.. నేను హామీ ఇస్తున్నా: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy guarantees that lands in prohibited list will be protected

  • నిషేధిత జాబితాలోని (22ఏ) భూములకు బై-నంబర్లు ఇస్తామని సీఎం హామీ
  • కూకట్‌పల్లి కేపీహెచ్‌బీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన
  • పేదలకు వారు నివసించే ప్రాంతంలోనే ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడి
  • ఇందిరమ్మ ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు రద్దు చేయాలని మంత్రులకు ఆదేశం
  • రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో నిషేధిత జాబితాలో (22ఏ) చేర్చిన భూముల విషయంలో హక్కుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు కేసుల కారణంగా మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో చేర్చిన సందర్భాల్లో, వివాదంలో లేని భూములకు బై-నంబర్లు కేటాయించి సమస్యను పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు.  గురువారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో కోర్ అర్బన్ (CURE) ప్రాంత పరిధిలో నిర్మించనున్న ‘ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్)’ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 22ఏ భూముల సమస్యపై కీలక హామీ ఇచ్చారు. “ఏదైనా కారణంగా మీ భూమి 22ఏ జాబితాలోకి చేరితే, కొనుగోలు చేసిన హక్కుదారుల స్థలాలు ఎక్కడికీ పోవు. నేను హామీ ఇస్తున్నా. కోర్టు కేసుల్లో ఉన్న కొంత భూమి కోసం మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో పెట్టారు. ఆ వివాదాస్పద భూమిని పక్కనపెట్టి, మిగతా వాటికి బై-నంబర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తాం” అని స్పష్టం చేశారు. కూకట్‌పల్లిలో 11 ఎకరాల అత్యంత విలువైన స్థలంలో పేదల కోసం ఇందిరమ్మ టవర్స్ నిర్మించడం గొప్ప సంకల్పమని సీఎం అన్నారు. నగరంలో నిరుపేదలు ఎక్కడ నివసిస్తుంటే అక్కడే వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణానికి అయ్యే వ్యయంలో లబ్ధిదారులు ఐదారు లక్షలు భరిస్తే, నిర్మాణ నాణ్యతను పర్యవేక్షించే హక్కు కూడా వారికి ఉంటుందన్నారు. పేదలపై భారం తగ్గించేందుకు ఈ ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా రద్దు చేయాలని వేదికపైనే మంత్రులకు సూచించారు. మొదటి విడతలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీనగర్ వంటి వలస కార్మికులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, గత ప్రభుత్వంలోని ఏ పథకాన్నీ ఆపలేదని, అదనంగా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటి పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్నామన్నారు. రెండేళ్లలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు.  కూకట్‌పల్లి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి తాను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని, ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.

Discover more from mvartanews.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page

Need Help?