డంపింగ్ యార్డు వరకు పోరాటం ఆగదు: సీపీఎం మండల కమిటీ.
చర్ల సెప్టెంబర్ 11 మీ వార్త ప్రతినిధి: చర్ల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని సాయినగర్, రాజయ్యనగర్, విజయకాలనీ జనావాసాలకు సమీపంలో ఉన్న డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని సీపీఎం మండల కమిటీ డిమాండ్ చేసింది. డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యార్డును అక్కడి నుంచి తొలగించే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆయా కాలనీల ప్రజలతో కలిసి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూజారి సామ్రాజ్యం, ఉపసర్పంచ్ కాపుల కృష్ణార్జునరావులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న అనంతరం జనావాసాలకు సమీపంలో అనాలోచితంగా డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న దుర్వాసన, పొగతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, ఇప్పటికే పలువురు ఆస్పత్రుల పాలయ్యారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డును మరో సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
సీపీఎం నాయకుల వినతిపై సర్పంచ్, ఉపసర్పంచ్ సానుకూలంగా స్పందిస్తూ, త్వరలో పాలకవర్గ సమావేశంలో సమస్యపై తీర్మానం చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే హామీలకే పరిమితం కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఎం నాయకులు కోరారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ముదరాజ్కు వినతిపత్రం అందజేసి డంపింగ్ యార్డు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి మచ్చ రామారావు, వార్డు సభ్యులు పొడుపుకంటి సమ్మక్క, కట్ట స్పందన, మండల కమిటీ సభ్యులు బందెల చంటి, దొడ్డి హరి నాగవర్మ, భీమగోని నవీన్, షారోని, శ్యామల చంద్రం, పామారు లక్ష్మి, కొమరం లక్ష్మి, సునీత, గోపాలం, పొగాకు పుల్లయ్య, మడకం రవి, సూరమ్మ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.

