mvartanews.com
Newspaper Banner
Date of Publish : 15 June 2025, 2:38 pm Digital Edition : MANA MI VARTA NEWS

ప్రభుత్వ బడుల్లో అత్యాధునిక సాంకేతిక బోధన..

ఎన్జీవోలతో విద్యాశాఖ ఒప్పందం


హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్‌జీవో సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంవోయూలు కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ఎంవోయూ కుదుర్చుకున్నట్టు విద్యాశాఖ తెలిపింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్‌ టెక్‌ సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. ఇందుకు నందన్ నీలేకని నేతృత్వంలోని ఏక్‌ స్టెప్‌ ఫౌండేషన్‌, డాక్టర్‌ సునీతా కృష్ణన్‌ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్‌, అలక్‌ పాండే ఆధ్వర్యంలో ఫిజిక్స్‌ వాలా, ఖాన్‌ అకాడమీ, షోయబ్‌దార్‌ నిర్వహిస్తోన్న పైజామ్‌ ఫౌండేషన్‌, సఫీనా హుస్సేన్‌ ఆధ్వర్యంలోనే ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ లాంటి పేరొందిన సంస్థలతో విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకొంది.

రాష్ట్రంలో విద్యా నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలు, పథకాలకు ఆకర్షితులై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు వివిధ సంస్థలు ముందుకొస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. నందన్‌ నీలేకని నేతృత్వంలో ఏక్‌ స్టెప్‌ ఫౌండేషన్‌ కృత్రిమ మేధ ఆధారిత ఫ్లాట్‌ఫామ్‌తో 540 పాఠశాలల్లో పనిచేస్తుంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో 5వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్‌ భాషలతో పాటు మ్యాథ్స్‌ బేసిక్స్‌ను ఈ సంస్థ అందిస్తుంది.