Date of Publish : 14 June 2025, 2:13 pmDigital Edition : MANA MI VARTA NEWS
జీ-7 సదస్సుకు హాజరుకానున్న ప్రధాని
దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సైప్రస్, కెనడా క్రొయేషియా దేశాలలో ఐదురోజులపాటు పర్యటించనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా వెల్లడించింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో జూన్ 15-16 తేదీల్లో పర్యటించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని మోదీనే. పర్యటనలో భాగంగా సైప్రస్ అధ్యక్షుడితో ఆయన చర్చలు జరపనున్నారు. దీనితోపాటు వ్యాపారవేత్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా పెంచుకోవడం, మధ్యధరా ప్రాంతంతో భారత్ సంబంధాల బలోపేతం, యూరోపియన్ యూనియన్లతో సంబంధాలను మరింత పటిష్టం చేసే విధంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. అక్కడి నుంచి ప్రధాని మోదీ నేరుగా కెనడాకు వెళ్తారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జూన్ 16-17న కననాస్కిస్లో జరగనున్న జీ-7 సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం వరుసగా ఆరోసారి. ఇందులో భాగంగా జీ-7 దేశాధినేతలతో సమావేశం కానున్నారు. జీ-7 దేశాలలోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలు, ముఖ్యంగా ఏఐతో(AI) అనుసంధానం, క్వాంటమ్ సంబంధిత అంశాల గురించి చర్చలు జరపనున్నారు. తిరుగు ప్రయాణంలో భాగంగా జూన్ 18న మోదీ ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.